Tuesday 22 December 2015

ఓల్గాకు (పోపూరి లలిత కుమారి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు తాను చేసిన సాహిత్య సేవకు సముచిత గౌరవం దక్కింది. ఆమె 2015 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఓల్గా రాసిన ‘విముక్త’ కథా సంపుటికిగాను ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు జ్యూరి వెల్లడించింది. ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి (w/o అక్కినేని కుటుంబ రావు). కలం పేరు  ఓల్గా. 

ఓల్గా 1950 నవంబర్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో జన్మించారు. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎ చేసి తర్వాత తెనాలిలోని విఎస్ఆర్ కళాశాలలో తెలుగు అధ్యపకురాలిగా పనిచేశారు. ఆమె 1991 నుంచి 1997 వరకు ఆస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె ప్రస్తుతం అస్మితలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె 1990లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. 2014లో లోక్ నాయకు ఫౌండేషన్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు.

‘స్వేచ్చ’ రచన ద్వారా ఆమె ప్రాచుర్యంలోకి వచ్చారు. ఫెమినిస్ట్ రచనా దృక్పథాన్ని తెలుగులో ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. ఈమె వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ రైట్స్, లిటరేచర్ అండ్ డెవలప్‌మెంట్(డబ్ల్యూవోఆర్‌ఎల్‌డీ) స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సంస్థ పబ్లిషర్స్, అనువాదకులు, రచయితలు స్వేచ్చగా మాట్లాడేందుకు వేదికగా పనిచేస్తోంది.

రాజకీయ కథలు, స్వేచ్ఛ, సహజ, ప్రయోగం, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, గులాబీలు, ఆకాశంలో సంగం, పలికించకు మౌనమృదంగాలు, అలజడి మా జీవితం వంటి పలు రచనలు చేశారు. మాకు గోడలు లేవు, నూరేళ్ల చలం వంటి రచనలకు ఆమె సంపాదకత్వం వహించారు.

No comments:

Post a Comment